ETV Bharat / opinion

అవకాశవాదమే ఎజెండాగా.. ఫిరాయింపు 'రాజ'కీయాలు

author img

By

Published : Jul 27, 2020, 6:29 AM IST

చట్టాలను తయారుచేసే శాసన సభ్యులే చట్టానికి దొరక్కుండా పార్టీలను ఫిరాయిస్తూ.. అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ తరఫున ఎన్నికైన శాసన సభ్యులు నైతిక రాజకీయ విలువలను పాటించకుండా, అవకాశవాద రాజకీయాలతో పార్టీ ఫిరాయింపులకు పాలపడుతున్నారు. దీనివల్ల రాజ్యాంగ స్ఫూర్తి మంటగలిసిపోతోంది. రాజకీయ అస్థిరత్వం ఏర్పడటమే కాకుండా ప్రజాభిప్రాయం కూడా వమ్మవుతుంది. తాజాగా రాజస్థాన్​లో ఇదే ఫిరాయింపుల రాజకీయం నడుస్తోంది.

crossover politics in rajasthan
ఫిరాయింపు 'రాజ'కీయాల గొంగడి

రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధ్యమవుతాయి. అయితే ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన శాసన సభ్యులు నైతిక రాజకీయ విలువలను పాటించకుండా, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా, అవకాశవాద రాజకీయాలతో పార్టీ ఫిరాయింపులకు పాలపడితే ఏమవుతుంది? రాజకీయ అస్థిరత్వం ఏర్పడటమే కాకుండా ప్రజాభిప్రాయం కూడా వమ్మవుతుంది. చట్టాలను తయారుచేసే శాసన సభ్యులే చట్టానికి దొరక్కుండా పార్టీలను ఫిరాయిస్తూ, అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఈ మధ్యకాలలో చూస్తున్నాం. జూన్‌లో మణిపూర్‌ శాసనసభ అందుకు వేదికైంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ శాసనసభల్లోనూ ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో మరో ఫిరాయింపుల రాజకీయం గజ్జెకట్టి ఆడుతోంది.

మినహాయింపులతో తూట్లు

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేక లోపాలతో వాటిని అడ్డుకోలేక అవస్థలు పడుతోంది. వాటిని సరిదిద్దకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఈ చట్టం అసమ్మతి-ఫిరాయింపుల మధ్య తేడాను స్పష్టంగా వివరించనందువల్ల, సభ్యులు తమ అసమ్మతిని తెలియజేసే హక్కును ఈ చట్టం కాలరాస్తోంది. మరోవైపు రాజకీయ పార్టీలు, చట్టసభల బయట, సభ్యులు తమ పార్టీకి వ్యతిరేకంగా జరిపే కార్యకలాపాలకు అనర్హులను చేసే అవకాశాన్ని కల్పించలేకపోయింది. ఈ చట్టం వ్యక్తిగత ఫిరాయింపులను నిరోధిస్తూ అదే సమయంలో మూకుమ్మడి ఫిరాయింపులను (మూడింట రెండో వంతు) చట్టబద్ధం చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సభ్యుడు ఫిరాయింపులకు ఎప్పుడు పాల్పడినా అనర్హుడవుతాడు. అదే నామినేటెడ్‌ సభ్యుడు ఆరు నెలల్లోపు ఫిరాయింపులకు పాలపడితే తమ సభ్యత్వానికి అనర్హుడు కాడు. ఎవరి కోసం ఈ మినహాయింపులు? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో సభాధ్యక్షుడి పాత్ర ఎంతో కీలకమైంది. ఫిరాయింపులపై నిర్ణయాధికారం సభాధ్యక్షులకు కట్టబెట్టడంలో ఔచిత్యం లేదు. సభాధ్యక్ష పదవులను రాజ్యాంగ పదవులుగా అభివర్ణించినా, ఏ కోణం నుంచి చూసినా అవి రాజకీయ పదవులే. ఈ చట్టం ప్రకారం- 'చట్టసభల్లో పార్టీ ఫిరాయింపులకు పాలపడిన సభ్యులపై వేటు వేసే అధికారం ఆయా సభల సభాధ్యక్షులకు మాత్రమే ఉంటుంది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.' కానీ 1993లో 'కిమోటో ఝలోహాన్‌ వర్సెస్‌ జాచిలు' కేసులో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసింది. సభాధ్యక్షుడి నిర్ణయం అంతిమం కాదని, అది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని వ్యాఖ్యానించింది.

స్వేచ్ఛను పరిరక్షిస్తూ..

ఒక రాజకీయ పార్టీ తరపున ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీనిగాని, ఆ పార్టీ ప్రతిష్ఠనుగాని దెబ్బతీసే విధంగా బహిరంగంగా మాట్లాడినా లేదా ప్రవర్తించినా, సభాధ్యక్షుడు అతను ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడో అర్థం చేసుకుని ఆ మేరకు ఆ సభ్యుడిపై చర్యలు తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో స్పష్టీకరించింది. అదే సుప్రీంకోర్టు ఆ సభ్యులపై తీసుకునే చర్యలు రాజ్యాంగం కల్పించిన 105(1) అధికరణ (పార్లమెంటు సభ్యుల భావప్రకటన స్వేచ్ఛ)లోని స్వేచ్ఛను హరించకూడదనీ పేర్కొనడం గమనార్హం. భావప్రకటన స్వేచ్చ లేకుండా పార్టీ చెప్పిందే సభ్యుడు మాట్లాడాలటే అతడు రాజకీయపార్టీ ప్రతినిధి అవుతాడే తప్ప, ఎన్నటికీ ప్రజా ప్రతినిధి కాలేడని ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణనూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సభాధ్యక్షుడు ఒకవైపు సభ్యుల స్వేచ్ఛను పరిరక్షిస్తూనే మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాలపడటాన్ని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరమే సభ్యులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది.

నియమాల ప్రకారం ఫిరాయింపులపై ఫిర్యాదు అందిన తరవాతే సభాధ్యక్షుడు చర్యలు ప్రారంభిస్తాడు. ఫిరాయింపుదారులపై విచారణ జరిపి, చర్యలు చేపట్టడానికి నిర్దిష్టమైన కాలపరిమితిని ఈ చట్టం పేర్కొనలేదు. కోర్టులూ సభాధ్యక్షుల ఆదేశాలను మాత్రమే సమీక్షించే అధికారాన్ని కలిగిఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సభాధ్యక్షులకు కల్పించిన అపరిమిత అధికారాలే ఇప్పుడు ఆ చట్టానికి ఉరితాళ్లుగా మారాయి. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఫిర్యాదులిచ్చినా సభాధ్యక్షులు ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోకపోవడం, అధికార పార్టీకి చెందినవారు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే చర్యలు చేపట్టడం రివాజుగా మారింది. రాజకీయ ప్రయోజనాల ముందు రాజ్యాంగ విలువలకు ఏమాత్రం విలువ ఉండదని, చట్టాల్లోని లొసుగుల్ని ఉపయోగించుకొని వాటిని నీరుగార్చడంలో సామాన్యుల కంటే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే ముందుంటారని దశాబ్దాలుగా సభాధ్యక్షులు చట్టసభల సాక్షిగా ప్రవర్తిస్తున్నతీరు సామాన్యులు సైతం విస్తుపోయేలా ఉందనడంలో అతిశయోక్తి లేదు!

సంస్కరణలు తప్పనిసరి

ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫిరాయింపులకు పాలపడటాన్ని అరికట్టాలటే కొన్ని సంస్కరణలు చేపట్టాల్సి ఉంది. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని సభాధ్యక్షుల పరిధి నుంచి తొలగించాలి. తమ ప్రమేయం ఉన్న, ఆసక్తి ఉన్న వివాదంలో అదే వ్యక్తి న్యాయమూర్తిగా ఉండకూడదనే సహజ న్యాయ సూత్రానికి అది విరుద్ధం కాబట్టి, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారం సభాధ్యక్షుల పరిధి నుంచి తొలగించాలి. ఎన్నికల సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర స్థాయిలో రాష్ట్రపతికి, రాష్ట్రస్థాయిలో గవర్నర్‌లకు అప్పగించాలి. ఈ మధ్యకాలలో ఎన్నికల సంఘం మీదా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి, ఉభయ సభల అధ్యక్షులు, ప్రతిపక్ష నేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు ప్రముఖ న్యాయకోవిదులతో కూడిన కమిటీ ఈసీ సభ్యుల్ని నియమించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎన్నికల సంఘం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.

స్వార్థ ప్రయోజనాల కోసం

పార్టీలు తమ వ్యూహాల్లో భాగంగా కలిసొచ్చే పక్షాలతో కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తుంటాయి. ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం కూటముల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంలో పాలుపంచుకుంటుంటే, మరికొన్ని పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇవి రెండూ ప్రజాభిప్రాయానికి విరుద్ధమే కాబట్టి వీటినీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలి. రెండో పాలన సంస్కరణల సంఘం చేసిన సిఫార్సుల్లో ఇవి ఉన్నాయి కూడా. ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించి, నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ పూర్తిచేసి తీర్పు చెప్పేలా చర్యలు తీసుకోవాలి. 2017లో మణిపూర్‌ అసెంబ్లీలో జరిగిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు, సభాధ్యక్షులు తమ నిర్ణయాన్ని మూడు నెలల్లో ప్రకటించాలని స్పష్టీకరించింది. ఫిరాయింపులకు పాలపడిన సభ్యులను సభ్యత్వం నుంచి తొలగించడమే కాకుండా, వారు కనీసం ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి. రాజకీయ కుర్చీలాటలు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏ విధంగానూ క్షేమకరం కాదు. అందుకే రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా, ప్రజాభిప్రాయ పరిరక్షణ కోసం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పటిష్ఠపరచే విధంగా రాజ్యాంగ సవరణను తీసుకురావాల్సిన అవసరం ఉంది!

- కె.నరసింహారావు (రచయిత- పౌరశాస్త్ర అధ్యాపకులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.